మిమిక్రీ దిగ్గజం డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

  • వరంగల్ లోని స్వగృహంలో మృతి
  • గత కొంతకాలంగా అనారోగ్యం
  • మరో ముద్దుబిడ్డను కోల్పోయిన తెలంగాణ 
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన, వరంగల్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్దఎత్తున ఆయనింటికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. నేరెళ్ల మృతితో తెలంగాణ తల్లి మరో ముద్దుబిడ్డను కోల్పోయిందని సంతాపం తెలుపుతున్నారు.

కాగా, 1932, డిసెంబర్ 28న వరంగల్ జిల్లా మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన ఆయన, 16 సంవత్సరాల ప్రాయంలో ధ్వని అనుకరణ రంగంలోకి ప్రవేశించారు. అందులో నిష్ణాతులై దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రా, కాకతీయ వర్శిటీలు గౌరవ డాక్టరేట్ పురస్కారాలను ఆయనకు ఇచ్చాయి. 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన జన్మదినాన్ని ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 1971లో పీవీ నరసింహరావు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో, వేణుమాధవ్ ఎమ్మెల్సీగానూ కొంతకాలం పనిచేశారు.
Go Back to Shorts
Nerella Venumadhav
Warangal Rural District
Mimicry
Died

More Telugu News